Thursday, October 29, 2015

పక్షులు


పక్షులు

సృష్టికర్తకు పక్షపాత బుద్ది వుందని తేలిపోయింది- కొన్ని విషయములలో. మనుషులనే కాకుండా జంతువులను పక్షులను సృటించాడు. ఈ పక్షులకు ఎగిరే శక్తి ఇవ్వడం పక్షపాత బుద్ధి కాదా? జంతువుల కెందుకు ఇవ్వలేదు?  అసలు, మనిషి అన్నవాడు నాలుగుచోట్లకు, నాలుగు దేశాలకు తిరగ వలసినవాడు. వాడికివ్వచ్చు గదా- ఈ ఎగిరే శక్తి. ఇవాళ మనం పడుతున్న ఈ రైళ్ళ ఇబ్బందులు, బస్సులు, కార్ల ఇబ్బందులు అన్నీ తప్పేవి కాదా.  ముఖ్యంగా రాజకీయ నాయకులు పాపం- రెండ్రోజుల కోసారి రాజధాని నగరమైన ఢిల్లీకి పరుగెత్త వలసిన ప్రోగ్రాం కదా. అదే, పరుగెత్తడం అంటే కాళ్లతో కాదు-విమానాల కోసం. ఆ బాధలు వుండేవి కాదు కదా?ఎయిర్ పోర్టు ఖర్చులు, విమాన ఖర్చులు, సెక్యూరిటీలు- ఇవ్వన్నీ మిగిలి దేశానికి కావలసినంత ధనం మిగిలేదే? ఇదేం ఆలోచించుకోలేదు- అలాగే నాకే గనుక సృష్టికర్తృత్వం వచ్చివుంటే, మానవులందరికీ రెక్కలు ఇచ్చి- ఇష్టం వచ్చినట్టు ఎగరండ్రా అనేదానిని. ఇప్పుడేం లాభం లేదు. అయిపోయిందనుకోండి.
పక్షుల్లోనూ అసూయలు కలిగించే చేష్టలు పెట్టాడు. కోడి, బాతు, నెమలి లాంటివి ఎగర లేవు. ఏదో కప్ప దాట్లు వేస్తాయి అంతే. అందుకే  కోడి- తన పిల్లల్ని ఎత్తుకు పోడానికి ఏ డేగో, గెద్దో వచ్చినప్పుడు, తనని పుట్టించినవాడిని తిట్టి, ఎగురుతూ వచ్చే ఇతర పక్షుల్ని ఈర్ష్యగా చూస్తుంది. ఐతే, జంతువుల్లో క్రూర జంతువులున్నట్టు పక్షులలో క్రూర పక్షులు లేవు. అంటే, పులి, సింహం లాగా మనిషిని తినేసేవి. అదో సుగుణం. కాకులకి ఒక మంచి బుద్ధి వుంది. చెడ్డ బుద్ధి వుంది. సూర్యదయంతోనే లేచి, మనిషిని లేపుతాయా- మనిషి ఏదైనా ఎండ బెట్టుకుంటే తినేసి పారి పోతాయి. ఒకసారి ఇంట్లోకి ప్రవేశించి, దొరికినవి పట్టుకు పోతాయి. ఇక, పావురాలు లాంటివి జనం మధ్యలో వుండే పక్షులు. చిన్న పిట్టలు, పిచ్చుకలు, అవి పాపం గింజలు తిని బతుకుతాయి. వాటికి మనిషి భయం లేదు. ఇళ్లల్లోనే గూళ్లు కట్టుకుంటాయి. ఒకరకం పక్షులు చెట్లకు గూళ్లు కట్టుకుంటాయి. అబ్బ ! చెప్పలేం వాటి ప్రజ్ఞ. ఎంతో స్ట్రాంగ్ గా, ఏ సిమెంటు, ఏఇంజనీరు కట్టలేనంత బలంగా కట్టుకుంటాయి. ఎంత పెద్ద గాలి, వాన వచ్చినా, ఆ చెట్టుకొమ్మ విరిగి పడిపోతుందేమో గాని, ఆ గూడు మాత్రం చెక్కు చెదరదు. ఆ పీచో నారో ఎక్కడ సంపాదిస్తాయో మరి, ఒకొక్కటి తెచ్చుకుని పేర్చుకుని అల్లుకుంటాయి. మరి కాకి కూడ అంతే. చిన్న చిన్న పుల్లలు ఏరుకుని, ఏ చెట్టు మీదనో మనిషికి అందకుండా గూడు కట్టుకుంటాయి. అన్నట్టు కాకుల్లో ఐకమత్యం వుంది. ఆ ఐకమత్యం  చూసి మనిషి నేర్చుకోవలసినది ఎంతో వుంది. ఒక కాకి చచ్చిపోతే, తక్కిన కాకులన్నీ మూగి సంతాపం తెలియ జేస్తాయి. ఒక మనిషి పోతే, పోతే పోయాడు అనుకుంటాడు ఇంకో మనిషి. దగ్గరి వాళ్లలో కొందరు వస్తారు. కాకులు అలా కాదు. అన్నీ వస్తాయి. కొన్ని పక్షులు మనిషికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా కోడి. దాని గుడ్లు, పిల్లలు ఆహారమే, కొందరు పావురాన్ని తింటారు. ఆ పక్షులు మనకి నేర్పేది శాంతి. మనం ప్రపంచ శాంతికి వాడుకునే చిహ్నం పావురం, ఈ పావురాలు పురాణ కధల్లో కొరియెర్ లు, పోస్ట్ మాన్లు వాటి కాళ్లకి లేఖలు కట్టి ఎగర వేస్తే వాటికి ఇచ్చిన శిక్షణ వల్ల అవి అవతల వారికి అందజేసేవిట. హంస అనే గొప్ప పక్షి ఎక్కడో దూరంగా వుంటుంది కాని అది కూడ రాయబారాలు నడిపేదిట. హంస రాయబారము గుర్తుకు తెచ్చుకోండి. హంస లాగే, పక్షుల్లో అందమైన పక్షులు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా రామ చిలుకలు. దానికి మాట నేర్పితే, నేర్చుకుంటుంది. కాని దాన్ని పంజరం అనే సెంట్రల్ జెయిల్లో బంధిస్తాడు మనిషి. వేళకు పండో, కాయో పడేస్తాడు గాని, స్వేచ్చ ఇవ్వడు. హాయిగా విహరించవలసిన పిట్టకి అదేం కర్మ . దాని అందమే దానికి శత్రువు. చిలుకల్లో ఎన్ని రకాలో. ఎన్నెన్ని అందాలో. చిలుకని పంజరం లో పెట్టినట్టు లవ్ బర్డ్స్ అనే పిట్టల్ని కూడ పెడుతున్నాం. అమ్మేవాళ్లు పంజరంతో సహ అమ్మి సొమ్ము చేసుకుంటారు. అవి పాపం ఆ పంజరంలోనే లవ్ చేసుకుంటాయి. వాటికి మాత్రం ప్రకృతి లోనో, సముద్రం ఒడ్డునో తిరుగుతూ ప్రేమ గీతాలు పాడుకోవాలని వుండదా?
మనం  జాతీయ పక్షి నెమలిని అన్నాం గాని పక్షులలో రాజు గరుడ పక్షి. దాన్ని పక్షి రాజు, పక్షీంద్రుడు అన్నారు. శ్రీ మహీవిష్ణువు శేషుడి మీద నిద్రించినా, ఎక్కడికి వెళ్లాలన్నా గరుత్మంతుడు అనబడే గరుడు మీదనే వెళ్లెవాడు. అసలు, అర్ధంకాని విషయం ఒకటుంది. విష్ణువు అక్కడ మాయమై, ఇక్కడ ప్రత్యక్షం కాగలడు. అవతారాలు ఎత్తగలడు. మరి, గరుత్మంతుడి పైన కూర్చుని ప్రయాణం చేయడం ఎందుకో  .సతీ దేవికి హంస వాహనం. వాళ్ల అన్న ఎలుకని వాహనం చేసుకుంటే, తమ్ముడు కుమారస్వామి నెమలిని ఏర్పాటు చేసుకున్నారు మన్మధుడికి చిలుక వాహనం. శనీశ్వరుడికి గద్ద, కాకి వాహనాలు.
పక్షుల్లో మనకు తెలిసిన పెద్ద పక్షి ఉష్ట్ర పక్షి. అది ఎండన పడిపోతూ ఎడారిలలో ఉంటుంది. కొన్ని పక్షులు కూతవు పెడతాయి. కొన్ని గట్టిగా అరవవు. కోడి, సూర్యోదయం కాకముందే కొక్కొరొకో అని కూత పెడుతుంది. గడియారాలు లేని రోజుల్లో కోడి కూతే అలారం.  పావురాలు కువ కువ లాడితే కోయిల మాత్రం చక్కగా కూస్తుంది. కోయిల కూతలు వినవిస్తే వసంత కాలం వచ్చినట్టు. కోయిల కూత పాటలా వుంటుందని కవుల భావన. అందుకే పాడే వాళ్లకి గన కోకిల అని బిరుదులు ఇస్తారు. కోయిల కూతల మీద ఎన్నో కవితలు, సినిమా పాటలూ వచ్చాయి. డబ్బు సంపాదించడమే గాని, దానం ఇవ్వడం తెలియనట్టు: కోయిలకి గుడ్లు పెట్టుడం తెలుసు గాని పొదగడం తెలీదుట. అంచేత, కాకి గూడు వెతికి, అందులో తన గుడ్లని పడేస్తుంది
పక్షులన్నీ గూళ్లుకట్టుకోలేవు. పావురాలు ఇళ్ల మీద ఏమూలో వుంటాయి. కోడి అవసరం మీనిషికి వుంది కాబట్టి దానికి బుట్టల్లాంటివి పెడతాడా మనిషి. చాలా పక్షులకి ఇళ్లు, వాకిళ్లు వుండవు. కట్టి ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ వాళ్లు లేరు. కుక్కలకి వాసన ఎక్కువైనట్టు కొన్ని పక్షులకు దృష్టి ఎక్కువ. గద్దలు, రాబందులకి దూర దృష్టి వుంది. అవి ఎక్కడో గగన మార్గంలో సంచరిస్తూ, కింద ఎక్కడో వున్న వాటి ఆహారాన్ని గమనించి, రివ్వున వాల్తాయి. మనం, చిన్న పురుగు పాటు కూడ చెయ్యం. ఎంచేతంటారా, ఈగలు,  దోములు, తుమ్మెదలు ఎగురుతూ వుంటాయి. దోమలాగ కూడ మనం ఎగురలేం కదా. తూనీగలు బాగా ఎగురాతాయి. వాన వచ్చే జాడ కనిపెట్ట గల శక్తి తూనీగలకి వుంది. అవి, గుంపులుగా ఎగురుతూ కనిపిస్తే వాన పడే సూచన, భూకంపాలు వచ్చేముందు, పక్షులకీ, జంతువుకీ తెలిసినట్టు ఏ వాతావరణ శాస్త్రజ్ఞుడికీ తెలీదు.   
మనమైతే, గడియారం చూస్తే గాని, వేళ చెప్పలేం. పక్షులు చెబుతాయి. ఒకసారి, శాస్త్రజ్ఞులు ఒక ప్రయోగం చేసారు.ఒక భూ గృహంలో మనషుల్ని, పక్షుల్ని, జంతువుల్ని పెట్టారు. వాళ్లకి బయటి ప్రపంచంతో ఏ సభంధాలు లేకండా చేసారు. రాత్రి ఏదో పగలేదో తెలియని పరిస్ధితి కల్పించారు, దీపాలు మాత్రం వెలిగిస్తూ. ఎవరి దగ్గిరా గడియారాలు లేవు. మనుషులందరికీ రాత్రి పగలూ ఒక్కలాగే వున్నాయి. కాని, పక్షులు మాత్రం బయట తెల్లవారగానే  కిల కిలా రావాలు చేసావిట. ఆ జ్ఞానం వాటికి ఇచ్చాడు జన్మించినవాడు. మనిషికి ఇవ్వలేదు. అందుకే కొన్ని విషయాలలో మనం గొప్పయితే, కొన్ని విషయాలలో పక్షులు, జంతువులూ గొప్ప.  పక్షి జాతుల్లో వున్న గుణాన్ని బట్టి వాటితో ఎన్నో కధలు కల్పింపబడ్డాయి. అవి, మాట్లాడుతూ చెప్పలేని కబుర్లు ఆ పక్షుల కధలు చెబుతాయి. కాని, మనిషి మాత్రం ఎందుకో పక్షిని చీదరించుకుంటాడు. పోరా ఫక్షి తిడతాడు ఎవరి మీదనైనా కోపం వస్తే  అపశకున పక్షి అంటాడు. తన పొరపాటును పక్షి మీదకు తోసేస్తూ,  ఏ పక్షి మనిషిని తిట్టదు.
ఇదే, సృష్టి కర్త చేపలకి ఈత నేర్పించినట్టు బాతులకి ఈత నేర్పాడు. నిత్యం నీట్లోనే వుంటూ కొంగ జపం చేసే కొంగలకి ఈత నేర్పలేదు. అడవి జంతువులు స్నానాలు చెయ్యవు. పళ్లు తోము కోవు. కాకులు అప్ఫుడప్ఫుడు స్నానం చేస్తాయి. నదుల్లోనో, చెరువుల్లోనో ఇలా స్నానానికి వెళ్లి అలా వచ్చేసిన వాడిని కాకి  స్నానం గాడు అంటాము. కాకి పిల్ల కాకికి ముద్దుఅని, కాకి ముక్కుకి దొండ పండు అని, కాకి గూట్లో కోయిల పిల్ల అని, పిల్ల కాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని కాకి పరంగా సామెతలు ఉంటే.  కోడిగుడ్డు కి ఈకలు పీకి నట్టు, కోడి నలుపైనా గుడ్డు తెలుపే, కోడి గుడ్డు పగలు గొట్టడానికి గుండ్రాయి కావాలా అనికోడి మీద కాకి మీద మనం వ్యంగంగా మాట్లాడతాము.
ఏనాడో వున్నాయని చెప్పుంకుంటున్న గండ భేరుండ పక్షులు, జటాయు పక్షులు, రాఁక్ పక్షులు అంతరించి పోయినట్టు- రాబందులు, పిచ్చుకలూ అంచరించి పోతున్నాయని పక్షి శాస్త్రజ్ఞులు ఆందోళన పడుతున్నారు.
మన కర్ణ పిశాచి అనబడే సెల్ ఫోన్ తరంగాలు తాకిడికి పిచ్చుకలు లాంటి చిన్న పిట్టలు అంతరించి పోతున్నాయి అవి బతిరి వుండాలని మనం సెల్ ఫోన్లు మానేస్తామా ఎక్కడైనా ? తరcగాల  మధ్యకి ఆ పిట్టల్ని రావద్దని చెప్తామా.. మన ఆనందానికి, అవసరానికి ఆ పట్టలు బలి అయిపోతున్నాయి.
పక్షుల్లో ఎన్నో జాతులున్నాయట- మనుషుల్లో అన్ని లేవు. మనిషుల్లో వేర్వేరు జాతులు 4 లక్షలయితే, పక్షి జాతులు పది లక్షలకి పైగా వున్నాయని  శాస్త్రకారుల నిర్ణయం. పక్షులకి మనిషే హాని చేస్తాడు గానీ, పక్షి మనిషికి హాని చెయ్యదు. పైగా వాటి వల్ల మనిషికి ఉపకారాలున్నాయి. మాట రాకపోతేనేం- పక్షులకి తెలివి తేటలున్నాయి.వినికిడి శక్తి వుంది. చూపు వుంది. గొంతు వుంది. మాట రాదు. అంతే కదా. ఎందుకూ మాట ? ఒకళ్ని తిట్టక్కర్లేదు, దూషించక్కర్లేదు, అపశబ్దాలు పలకనక్కర్లేదు. అందులో కొన్ని కొన్ని విషయాల్లో పక్షులు మనిషి కంటె గొప్పవే.


Wednesday, October 28, 2015

             


మాటల పక పకలు
మీరు ఎటు చదివినా మా పేర్లు మారవు
1. నంద నందనం
2. రంగ నగరం
3. వికట కవి
4. రామా కుమారా
5. గడపలో పడగ
6. కిటికి
7. పాలు నలుపా
8.  లుకలుకలు
9. ముత్యము

మాటల గారడి

1. రాజు కాని రాజు -  తరాజు
2. తారు కాని తారు – జలతారు
3. పతి కాని పతి  - తిరుపతి
4. జనము కాని జనము – భోజనము
5. బడి కాని బడి – రాబడి
6. వరం కాని వరం – కలవరం
7. గొడుగు కాని గొడుగు - పుట్ట గొడుగు
8. తాళం కాని తాళం – పాతాళం
9. వెల కాని వెల – కోవెల
10. దారి కాని దారి - గోదారి


పొడుపు కధలు

1. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మకు కొటి పువ్వులు, అన్ని పువ్వుల్లో రెండే కాయలు
జ) ఆకాశం, చుక్కలు, సూర్యుడు, చందమామ
2.  నిద్రిస్తునే ఉంటాను, కాని కన్ను మూయను
జ) చేప
3. పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు
జ) సీతా ఫలం
4. పళ్ళు ఉన్నా నోరు లేనిది
జ) రంపం
5. అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది
జ) గజం బద్ద
6. నాలుగు స్తంభాలు నడవంగా రెండు చేతులు తెరగంగా చక్కని దొరలు ఎక్కేరు ? ఏమిటిది ?
జ) ఏనుగు